హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు రైలు నుంచి కిందకు దూకి తీవ్ర గాయాల పాలైంది.
పోలీసుల కథనం ప్రకారం…
అనంతపురం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి మేడ్చల్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సెల్ఫోన్ మరమ్మతు కోసం సికింద్రాబాద్ వెళ్లిన ఆమె, తన పని ముగించుకుని తిరిగి మేడ్చల్కు వెళ్లేందుకు ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణమయ్యింది.
ఆమె మహిళల బోగీలో ఎక్కగా, అక్కడ ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ వద్ద దిగిపోయారు. దీంతో బోగీలో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునేందుకు ఓ యువకుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తన నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలు చివరకు రైలు నుంచి దూకింది. ఈ ఘటన కొంపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.