వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖిల్లా వరంగల్లోని మామునూరు నాలుగో బెటాలియన్ సమీపంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇనుప స్తంభాలను తీసుకెళ్తున్న లారీ అధిక వేగం కారణంగా అదుపు తప్పి, రెండు ఆటోలపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు, ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. లారీ ఒక్కసారిగా మీదపడడంతో రెండు ఆటోలు నుజ్జునుజ్జయ్యాయి.
స్థానికుల కథనం ప్రకారం, లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలంలో ఉన్న ప్రజలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు, కానీ అప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కాలు విరిగింది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. లారీ బోల్తా ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘోర సంఘటన స్థానికులను కలచివేసింది. ప్రమాదస్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.