ప్రియురాలితో జల్సాల కోసం క‌న్న‌త‌ల్లి న‌గ‌లే కాజేశాడు

ప్రియురాలితో జల్సాలు.. డ‌బ్బుకోసం సొంత ఇంట్లోనే చోరీ

ప్రియురాలితో జ‌ల్సాల‌కు అల‌వాటుప‌డిన ఓ యువ‌కుడు త‌న విలాసాల‌కు సొంత ఇంటికే క‌న్నం వేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తోంది. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలా వరంగల్ పడమరకోటకు చెందిన ఆర్ఎంపీ గుర్రపు రామకృష్ణ ఇంట్లో జరిగిన చోరీ స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఈ నెల 8వ తేదీన రామకృష్ణ హైదరాబాద్‌లో ఒక శుభకార్యానికి వెళ్లి, ఇంటికి తాళం వేసి బయలుదేరారు. అదే రోజు అర్ధరాత్రి తిరిగి వచ్చేసరికి, ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలోని 16 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఆయన వెంటనే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు విచారణ చేప‌డుతున్నారు. కాగా, మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా పారిపోతున్న గుర్రపు జయంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. జయంత్ కొంత బంగారాన్ని కరిగించి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కాడు. విచారణలో జయంత్, రామకృష్ణ కుమారుడిగా గుర్తించబడ్డాడు. జయంత్ నగరంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతడు తన ప్రేయసితో కలిసి జల్సా చేయడానికి, అప్పులు తీర్చడానికి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

గతంలో హైదరాబాద్‌లో ఫుడ్ కోర్టు నిర్వహించి నష్టపోవడంతో స్నేహితుల వద్ద అప్పులు చేసిన జయంత్, ఆర్థిక ఇబ్బందులతో ఈ నేరానికి ఒడిగట్టినట్లు తెలిపాడు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ కేసులో చోరీకి గురైన బంగారు ఆభరణాలను రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే సొంత కుమారుడే ఇంట్లో చోరీ చేయడం సంచ‌ల‌నంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment