”నా కాళ్లు ప‌ట్టుకుంటే ఎమ్మెల్యేని చేశా”.. కొండా ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

''నా కాళ్లు ప‌ట్టుకుంటే ఎమ్మెల్యేని చేశా''.. కొండా ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వరంగల్ (Warangal) కాంగ్రెస్ పార్టీ (Congress party)లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాష్ట్ర వనం, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) భర్త (Husband), మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ (Konda Murali) తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తూ, సొంత పార్టీ ఎమ్మెల్యేలైన కడియం శ్రీహరి (Kadiyam Srihari), రేవూరి ప్రకాష్ రెడ్డి (Revuri Prakash Reddy)లను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, తన కుమార్తె కొండా సుస్మిత పటేల్ (Konda Sushmitha Patel) పరకాల నియోజకవర్గంలో రాజకీయ రంగప్రవేశం చేయనుందని ప్రకటించి, కొండా సురేఖ మంత్రి పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ పోదని ప్ర‌క‌టించారు.

కొండా మురళీ తన వ్యాఖ్యల్లో, “కనుబొమ్మలు లేని నాయకుడు గతంలో టీడీపీ(TDP)ని బరస్ట్ చేసి, చంద్రబాబు (Chandrababu)ను ఓడించాడు. ఇటీవల కేటీఆర్‌(KTR)ను వెన్నుపోటు ఓడించాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ (Encounter Specialist)గా ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాడు. బయటి పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఇజ్జత్ ఉంటే పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలి” అని రేవూరి ప్రకాష్ రెడ్డి, క‌డియం శ్రీ‌హ‌రిని ఉద్దేశించి విమర్శించారు. పరకాలలో “75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడు” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌కు సూచనలు చేస్తూ “పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కోవర్ట్‌లు ఉన్నారు. నాకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై కాదు, కోవర్ట్‌లపై చర్యలు తీసుకోండి” అని డిమాండ్ చేశారు. “వరంగల్ తూర్పులో నేనున్నంత వరకు రెండో నాయకుడు ఎవరూ ఉండరు” అని తన ఆధిపత్యాన్ని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత గ్రూప్ రాజకీయాలను మరింత ఉధృతం చేశాయి.

ఈ వివాదం నేపథ్యంలో, కొండా సురేఖ, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య గత కొన్ని నెలలుగా నడుస్తున్న విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి. గత ఏడాది దసరా సందర్భంగా ధర్మారం గ్రామంలో ఫ్లెక్సీల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కొండా సురేఖపై ఆరోపణలు చేస్తూ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం కూడా ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. కొండా మురళీ తాజా వ్యాఖ్యలు, సుస్మిత పటేల్ రాజకీయ ప్రవేశ ప్రకటన వరంగల్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ సమీకరణలకు దారితీసే అవకాశం ఉంది. సురేఖ మంత్రి పదవి విషయంలో వస్తున్న పుకార్లను మురళి ఖండిస్తూ, “సురేఖ పదవి ఎక్కడికీ పోదు” అని స్పష్టం చేయడం గమనార్హం. ఈ పరిణామాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment