విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్నాయుడు ప్రెస్మీట్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి మంత్రి రామ్మోహన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి వైసీపీ ప్రభుత్వం చేసిన పోరాటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేద్దామని నిర్ణయించాం.. కానీ వైఎస్ జగన్ గవర్నమెంట్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు
‘ అని ప్రస్తావించారు.
2021 మే 21న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో దివంగత మంత్రి గౌతంరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా, దీనికి సభ నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించింది. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవం అని, ఎంతోమంది కృషి, పోరాటం, ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న కర్మాగారం అని మంత్రి ఆ తీర్మానంలో పేర్కొన్నారు.