విశాఖ (Visakhapatnam) నగరంలోని నార్త్ సబ్ డివిజన్ మరో దారుణం జరిగింది. ఇటీవలే ఒక జ్యోతిష్యుడిని హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన సంఘటన మరవకముందే, ఇప్పుడు మరో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ (Woman)ను హత్య చేసి (Murdered) అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ (Petrol) పోసి తగలబెట్టారు దుండగులు. ఈ అమానవీయ సంఘటన భీమిలి పోలీస్ స్టేషన్ (Bheemunipatnam Police Station ) పరిధిలో చోటు చేసుకుంది.
దాకమర్రి ఫార్చ్యూన్ లే ఔట్ (Dakamari Fortune Lay Out) ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు ఆమెను హత్య చేసిన అనంతరం ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలి వయస్సు 25 సంవత్సరాలు ఉంటుందని, వివాహితగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ సీపీ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రస్తుతం భీమిలీ పోలీసులు కేసును విచారిస్తున్నారు. యువతి ఎవరు..? దాకమర్రి ఫార్చ్యూన్ ప్రాంతానికి ఎందుకు వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.