విశాఖపట్నం (Visakhapatnam) పోలీస్ (Police) కమిషనర్ కార్యాలయం (Commissioner Office) ఎదుట సంచలన ఘటన జరిగింది. పవన్ కుమార్ (Pavan Kumar) అనే యువకుడు పెట్రోల్ (Petrol) పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పవన్ కుమార్ అనే యువకుడు తనపై జరిగిన అన్యాయానికి నిరసనగా సీపీ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని తనను తాను కాల్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతన్ని గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకొని ఆత్మహత్యను నివారించారు.
పవన్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. సంజయ్ (Sanjay) అనే వ్యక్తి విశాఖ సీపీకి తనకు పరిచయం ఉందని చెప్పి, సైబర్ సెక్యూరిటీ సెల్ (Cyber Security Cell)లో ఉద్యోగం(Job) ఇప్పిస్తానని నమ్మించి పవన్ నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. మోసపోయిన విషయాన్ని తెలుసుకున్న పవన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు నిందితుడికి మద్దతుగా వ్యవహరించారని ఆరోపించాడు. అంతేకాదు, అతనిని బెదిరించడంతో పాటు రాత్రి మొత్తం స్టేషన్లో ఉంచి వేధించారని చెప్పాడు.
పోలీసుల నుంచి న్యాయం దక్కలేదని ఆవేదనకు లోనైన పవన్, చివరికి సీపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.







