విశాఖపట్నం (Visakhapatnam)లో 25 గ్రాముల కొకైన్ (Cocaine) స్వాధీనం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొకైన్ పట్టుబడి 12 రోజులు దాటినా ఈ కేసులో పెద్దగా పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో, ఈ కేసు విచారణ దారితప్పుతోందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కూటమి నేతల ఒత్తిడే ప్రధాన కారణమా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జూలై 5న ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) నార్త్ క్యాంపస్ (North Campus) సమీపంలో 25 గ్రాముల కొకైన్తో ముగ్గురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో సౌత్ ఆఫ్రికా (South Africa)కు చెందిన థామస్ డిజిమోన్ (Thomas Dijimon) (30), స్థానికుడైన చెకూరి అక్షయ్ (Chekuri Akshay) అలియాస్ మున్నా (Munna) (34), డాక్టర్ కమ్మెళ్ల శ్రీ కృష్ణ చైతన్య వర్మ (Kammela Sri Krishna Chaitanya Varma) (34) ఉన్నారు. అయితే, విచారణ అధికారులైన త్రీ టౌన్ సీఐ పైడయ్యా, ఈస్ట్ ఏసీపీ కె. లక్ష్మణ మూర్తి సెలవుపై వెళ్లడం, కూటమి నాయకుల ఒత్తిడి కారణంగా విచారణ నిద్రపోతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వివరాల ప్రకారం ఈ కేసులో మొత్తం ఆరుగురు అనుమానితులు ఉన్నారని, వీరిలో ఇద్దరైన ప్రిన్స్ (ఓమెనెఫె అలియాస్ బుచ్చి), మరో వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నారని అంచనా. కోర్టు థామస్ను వారం రోజులు, అక్షయ్, కృష్ణ చైతన్యలను మూడు రోజులు కస్టడీకి అనుమతించింది. అయితే, విచారణ అధికారి లేకుండానే దర్యాప్తు సాగుతోందని, ఈస్ట్ ఏసీపీ లక్ష్మణ మూర్తి చేతికి గాయమైందని కారణం చూపి సెలవుపై వెళ్లడం అనుమానాలను రేకెత్తిస్తోంది. కూటమి నాయకుల ఒత్తిడి కారణంగా కొందరు నిందితులను విడిచిపెట్టారని, రిమాండ్ రిపోర్టులో ఇద్దరు నిందితుల పేర్లను తొలగించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు విచారణ పారదర్శకతపై సందేహాలను మరింత పెంచుతున్నాయి.
25 గ్రాముల డ్రగ్స్ కేసులో కూటమి నేతల కుమారులు ఉన్నారని, వారిని కాపాడేందుకు విశాఖలోని ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ తీవ్రంగా కష్టపడుతున్నారని ఇటీవల అనేక వార్తలు వచ్చాయి. విశాఖ సీపీతో ఓ ఎమ్మెల్యే భేటీ అయ్యారని కూడా వార్తలు బయటకొచ్చాయి. జూలై 5న ఓ కూటమి ఎమ్మెల్యే నేరుగా విశాఖ పోలీసు ఉన్నతాధికారిని కలిసి, ఈ కేసులో ముగ్గురు నిందితులను విడుదల చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసు రిమాండ్ రిపోర్ట్లో విశాఖలోని ఓ పబ్లో డ్రగ్స్ వాడకం, దానికి సంబంధించిన చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. కూటమి నాయకులకు చెందిన ఈ పబ్లో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం. ఈ కేసులో నిందితుడు చెకురి అక్షయ్ ఢిల్లీ నుంచి ఒక గ్రాము కొకైన్ను 10 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో కూటమి నాయకుల కుమారులను తప్పించేందుకు పోలీసులపై ఒత్తిడి జరిగినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. జూన్ 5వ తేదీన సంఘటన జరిగితే ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడం స్థానికుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. విచారణలో ఆలస్యం, అధికారుల సెలవులు వంటి అంశాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విశాఖపట్నం డ్రగ్స్ హబ్గా మారుతోందని, కూటమి నాయకులు ఈ కేసును దిగమింగేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులు ఢిల్లీకి ఒక బృందాన్ని పంపినప్పటికీ, నిందితులను పట్టుకోవడంలో విజయం సాధించకపోవడం విచారణ పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.