అమెరికాలో కాల్పుల కలకలం.. భారత్‌కు చెందిన తండ్రీకూతురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. భారత్‌కు చెందిన తండ్రీకూతురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. వర్జీనియాలో జరిగిన ఈ ఘోర ఘటనలో గుజరాత్‌కు చెందిన తండ్రీకూతురు ప్రాణాలు కోల్పోయారు. ప్రదీప్ పటేల్, అతని కుమార్తె ఉర్మి పటేల్ దుండగుడి కాల్పుల్లో దుర్మరణం చెందారు. ఈ కాల్పులకు కారణమైన ఫ్రేజర్ దేవన్ వార్టన్ (44)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దారుణ ఘటన ఇలా చోటుచేసుకుంది
ప్రదీప్ పటేల్, ఆయన కుమార్తె ఉర్మి గురువారం వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో ఉన్న డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కు వెళ్లారు. అదే సమయంలో నిందితుడు ఫ్రేజర్ అక్కడికి వచ్చాడు. అతను మద్యం కోరగా, స్టోర్ సిబ్బంది తిరస్కరించారు. దీంతో ఆగ్రహంతో ఫ్రేజర్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతిచెందగా, ఉర్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఆరేళ్ల‌ క్రితం అమెరికాకు..
ప్రదీప్ పటేల్ గుజరాత్‌లోని మెహసనా జిల్లాకు చెందినవారు. తన భార్య హన్స్‌బెన్, కుమార్తె ఉర్మితో కలిసి ఆరు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లారు. అక్కడ బంధువుల డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేస్తుండేవారు. ప్రదీప్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఒకరు అహ్మదాబాద్‌లో, మరొకరు కెనడాలో నివసిస్తున్నారు. వారి కుటుంబంలో జరిగిన ఈ విషాద ఘటన బంధువులను కన్నీటిపర్యంతం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment