భారత క్రికెట్ (India cricket) చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన, ప్రభావవంతమైన బ్యాట్స్మెన్ల (Batsmen) లో ఒకడైన విరాట్ కోహ్లీ (Virat Kohli), తన టెస్ట్ క్రికెట్ కెరీర్ (Test Cricket Career) కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ “భారత్ తరఫున 14 సంవత్సరాలపాటు టెస్టు క్రికెట్లో ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వకారణం” అని పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటికీ, 2011లో టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు 123 టెస్ట్ మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ప్రయాణంలో అతను 9,230 పరుగులు సాధించాడు. కోహ్లీ టెస్ట్ కెరీర్లో 30 సెంచరీలు మరియు 31 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
తన కెప్టెన్సీ కాలంలో భారత టెస్ట్ జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన కోహ్లీ, విదేశాల్లో విజయాలు సాధించిన తొలి భారత కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అతని ఫిట్నెస్, ఆటపట్ల కలిగిన నిబద్ధత, మైదానంలో చూపించిన దూకుడు తదితర అంశాలు క్రికెట్ ప్రేమికుల మనసులను గెలిచాయి. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్తో భారత క్రికెట్లో ఒక అధ్యాయం ముగిసినట్లు అయ్యిందని కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల టీమిండియా ఓపెనర్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు గుడ్బై చెప్పారు. ఐదు రోజుల వ్యవధిలోనే కింగ్ కోహ్లీ కూడా టెస్టు క్రికెట్లకు గుడ్ బై చెప్పడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. రోహిత్ టెస్ట్ క్రికెట్కు దూరమయ్యాడన్న వార్త మరువక ముందే కోహ్లీ అనూహ్య ప్రకటన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందంటున్నారు.