విజయవాడ (Vijayawada) నగరంలో మరోసారి రౌడీషీటర్ల ఆగడాలు కలకలం రేపాయి. బహిరంగ ప్రదేశంలో సామాన్య ప్రజలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ ఘటన నగరంలోని కేదారేశ్వరపేట (Kedareshwarapeta) ప్రాంతంలో చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, కేదారేశ్వరపేటలో ఉన్న మాధురి బార్ వద్ద మద్యం మత్తులో ఉన్న రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు. అదే సమయంలో బార్కు పార్సిల్ కోసం వచ్చిన మోహన్ కుమార్ అనే యువకుడిపై అకస్మాత్తుగా దాడికి దిగారు. అయోధ్యనగర్కు చెందిన రౌడీషీటర్లు రాము, సాల్మన్లు బీరు సీసాలతో మోహన్ కుమార్ను చితకబాదారు.
దాడితో తీవ్ర భయాందోళనకు గురైన మోహన్ కుమార్ ప్రాణభయంతో కేకలు వేయగా, అక్కడున్న వారు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే నిందితులు వెనకడుగు వేయకుండా అడ్డువచ్చిన వారిపైనా దాడులకు తెగబడ్డారు. మద్యం మత్తులో విరుచుకుపడిన వీరు భౌతిక దాడులతో బార్ పరిసరాల్లో బీభత్సం సృష్టించారు.
ఈ మొత్తం ఘటన బార్ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. బహిరంగంగా బీరు సీసాలతో దాడులు జరగడం చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఇలాంటి అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.








