సీనియర్ నటి పుష్పలత (87) చెన్నైలో మంగళవారం రాత్రి కన్నుమూశారు. చెన్నై టి.నగర్లోని తిరుమల పిళ్ళై రోడ్డులోని ఆమె నివాసంలో కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడు కోయంబత్తూర్లోని మేటుపాలయం ప్రాంతానికి చెందిన పుష్పలత, చిన్నతనంలోనే భరతనాట్యంలో శిక్షణ పొందారు. 1955లో నటుడు ఎస్సే నటరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘నల్ల తంగై’ అనే తమిళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.
తెలుగు, తమిళం సహా ఐదు భాషల్లో నటన
తమిళంలో ‘కొంగు నాట్టు తంగం’ (1962) చిత్రంతో కథానాయకిగా మారిన పుష్పలత, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘చెరపకురా.. చెడేవు!’ ద్వారా ఆమె పరిశ్రమలో ప్రవేశించారు. ‘ఆడబిడ్డ, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, కొండవీటి సింహం, ఉక్కుమనిషి’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
కుటుంబ జీవితం
తమిళ నటుడు ఏవీఎం రాజన్ సరసన ‘నానుమ్ ఒరు పెన్’ చిత్రంలో కలిసి నటించిన పుష్పలత, ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి 1964లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒకరు నటి మహాలక్ష్మి, ఆమె కూడా తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు.