పుట్టిన ఊరును, కన్నతల్లిని మరవకూడదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని మాట్లాడారు. పుట్టిన ఊరును, కన్న తల్లిని ఎప్పటికీ మరవకండి అని సూచించారు. పండుగలు సొంతూర్లలో కుటుంబంతో కలిసి జరుపుకోవడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లినవాళ్లం అవుతామన్నారు.
తెలుగు భాషకు ప్రాధాన్యం
ఇంటిలోనూ, వీధుల్లోనూ, గుడుల్లోనూ, బడుల్లోనూ తెలుగులో మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు. యువత భారతీయ సంస్కృతిలోని విలువలను పాటిస్తూ, ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పండగ అంటే కుటుంబాల కలయిక అని, పక్కవారితో కలిసిపోవడం, సేవా కార్యక్రమాలు చేయడం, “వసుదైక కుటుంబం” అనే సిద్ధాంతాన్ని జీవన విధానంగా మార్చుకోవాలని పేర్కొన్నారు.