అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ (Usha Vance) కూడా ధృవీకరించడంతో వాన్స్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వాన్స్ దంపతులు త్వరలోనే తమ నాలుగో బిడ్డను స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. జులై చివరి నాటికి పండంటి మగబిడ్డ వారి కుటుంబంలోకి రానున్నట్లు సోషల్ మీడియా పోస్టుల్లో వెల్లడించారు. 2014లో వివాహం చేసుకున్న జేడీ–ఉషా వాన్స్లకు ఇప్పటికే ఈవాన్, వివేక్, మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు (Three Children) ఉన్నారు. నాలుగో సంతానంతో వారి కుటుంబం మరింత ఆనందంగా మారనుంది.
We’re very happy to share some exciting news. Our family is growing! pic.twitter.com/0RohEBYXM7
— Second Lady Usha Vance (@SLOTUS) January 20, 2026
జేడీ వాన్స్ (James David Vance) 1984 ఆగస్టు 2న ఓహియో రాష్ట్రంలోని మిడిల్టౌన్లో జన్మించారు. స్థానిక స్టేట్ యూనివర్సిటీలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన, తరువాత యేల్ లా స్కూల్లో న్యాయ విద్యను అభ్యసించారు. 2016లో విడుదలైన ఆయన ఆత్మకథ “Hillbilly Elegy” అమెరికా వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఈ పుస్తకం ఆధారంగా నెట్ఫ్లిక్స్లో చిత్రం కూడా రూపొందింది.
2022లో రాజకీయాల్లోకి ప్రవేశించిన జేడీ వాన్స్, రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి ఓహియో నుంచి సెనేటర్గా ఎన్నికయ్యారు. స్పష్టమైన అభిప్రాయాలు, సామాన్య ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం ద్వారా ఆయన వేగంగా ప్రజాదరణ పొందారు. అనంతరం 2025 జనవరి 20న అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి వైట్ హౌస్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఉషా వాన్స్ (ఉషా చిలుకూరి) అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. న్యాయ రంగంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఉషా వాన్స్, ప్రస్తుతం అమెరికా సెకండ్ లేడీగా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.








