తనకు జరిగిన అవమానం తట్టుకోలేక స్విగ్గి డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి సీతమ్మధార లోని ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్స్లోకి డెలివరీ బాయ్ అనిల్ (22) వెళ్లాడు.
ఫుడ్ డెలివరీ ఇచ్చే సమయంలో తలుపు తెరిచిన పనిమనిషికి అతని భాష అర్థం కాకపోవడంతో ఇంటి యజమానిని పిలిచింది. “మీ ఫుడ్ పార్శిల్ బ్రో” అని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఇంటి యజమాని ప్రసాద్, “సార్ అని కాకుండా బ్రో అంటావా?” అంటూ అనిల్పై దాడి చేశాడు. అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బంది చేత ఒంటిపై ఉన్న దుస్తులు విప్పించి దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు జరిగిన అవమానం తట్టుకోలేక డెలివరీ బాయ్ అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు, తోటి డెలివరీ బాయ్స్ ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం విశాఖ అపార్ట్మెంట్స్ వద్ద డెలివరీ బాయ్స్, బంధువులు ఆందోళనకు దిగారు.