గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌.. ఇద్ద‌రు యువ‌కులు మృతి

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌.. ఇద్ద‌రు యువ‌కుల‌ మృతి

గేమ్‌ ఛేంజర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్ తీవ్ర విషాదం నింపింది. ఈవెంట్‌కు వ‌చ్చి తిరిగి వెళ్తుండ‌గా, హీరో రామ్‌ చరణ్‌ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత‌ప‌డ్డారు. రాజమండ్రిలో జరిగిన ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరై, ఆనందంగా తిరిగి ఇంటికెళ్తున్న క్ర‌మంలో ఈ ప్రమాదం జ‌రిగింది. తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రికి తరలిస్తుండ‌గా మృతిచెందారు. పోలీసులు, కుటుంబసభ్యుల వివ‌రాల ప్ర‌కారం..

ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో వేమగిరిలో శనివారం రాత్రి గేమ్ చేంజర్ ప్రీరిలీజ్‌ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు చిత్ర‌యూనిట్‌తో పాటు ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం, రామ‌చ‌ర‌ణ్ బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా హాజ‌ర‌య్యారు.

ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గైగోలుపాడుకు చెందిన మణికంఠ (23) తన స్నేహితుడు చరణ్ ఇద్ద‌రూ కలిసి బైక్‌పై వచ్చారు. ఈవెంట్‌కు భారీస్థాయిలో అభిమానులు తరలిరావడంతో లోప‌లికి వెళ్లే వీళ్లేక‌, స్క్రీన్లపైనే ఈవెంట చూసి సంబ‌ర‌ప‌డ్డారు. అనంతరం స్వగ్రామం గైగోలుపాడుకు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. రంగంపేట మండలం వడిశలేరు సమీపంలోని కార్గిల్ ఫ్యాక్టరీకు చేరుకోగానే వారి బైక్‌ను వెనుక నుంచి వ్యాన్ బ‌లంగా ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో మణికంఠ, చరణ్‌ బైక్‌పై నుంచి కిందపడిపోయారు. ఈ దుర్ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. రక్తస్రావం కావడంతో వెంటనే స్థానికులు, పోలీసులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రికి తరలించే లోపే మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్ మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మణికంఠకు గతంలోనే తండ్రి చనిపోగా.. తల్లి కష్టపడి చదివిస్తోంది. మ‌రో యువ‌కుడు చరణ్ తన తండ్రితో కలిసి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరూ మరణించడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మ‌రి ఈ ఘ‌ట‌న‌పై చిత్ర బృందం, ఏపీ ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment