జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir) రాష్ట్రంలోని పహల్గామ్ (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి (Terrorist Attack) దేశ ప్రజలను భయాందోళనలోకి నెట్టేసింది. ఈ ఉగ్రవాద దాడిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. విశాఖపట్టణం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలి కుమ్మరి వీధికి చెందిన మధుసూదన్ ఉగ్రమూకల కాల్పుల్లో హతమయ్యారు.
వెంటాడి మరీ కాల్చారు..
విశాఖకు (Visakhapatnam) చెందిన రిటైర్డ్ బ్యాంక్ చంద్రమౌళి (Chandramouli) సమ్మర్ ప్రారంభమవ్వడంతో ఈనెల 16న ట్రావెల్ ఏజెంట్ ద్వారా కశ్మీర్ టూర్కి వెళ్లారు. చంద్రమౌళితో పాటు మరో ఐదుగురు కశ్మీర్ టూర్కి వెళ్లారు. పహల్గామ్లో పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో చంద్రమౌళి దుర్మరణం చెందారు. ఉగ్రదాడి సమయంలో ఆయన పారిపోవాలని ప్రయత్నించినా, ఉగ్రవాదులు వదలకుండా వెంటాడి కాల్చి చంపినట్లు సమాచారం. “మమ్మల్ని చంపొద్దు” అని వేడుకున్నా ఉగ్రవాదులు కనికరించలేదని అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈనెల 25న ఆనందంగా ఇంటికి తిరిగి రావాల్సిన చంద్రమౌళి టెర్రరిస్టుల కాల్పుల్లో ప్రాణాలు వదలడంతో.. ఆయన మృతదేహాన్ని తీసుకురావడానికి చంద్రమౌళి ఫ్యామిలీ కశ్మీర్కు వెళ్లింది. చంద్రమౌళితో వెళ్లిన మిగిలిన ఐదుగురు క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
కావలివాసి మృతి
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో సోమిశెట్టి మధుసూదన్ రావు (Somishetti Madhusudhan Rao) ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ ఘటన చోటుచేసుకుంది. కావలి (Kavali) కుమ్మరి వీధిలో సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడు మధుసూదన్.. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలించి, సాయంత్రానికి కావలికి మధుసూదన్ మృతదేహాన్ని తీసుకురానున్నారు. తల్లిదండ్రులు హార్ట్ పేషంట్స్ కావడంతో కొడుకు చనిపోయిన విషయాన్ని వారికి చెప్పకుండా గోప్యంగా ఉంచారు.