కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ కొనసాగుతోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతగా మారింది. తుని మున్సిపాలిటీలో ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు. అసలు సభ్యులే లేకపొయినా.. వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని కూటమి ప్రయత్నిస్తుంది. దాడులు, బెదిరింపులతో 9 మంది కౌన్సిలర్లను తనవైపునకు తిప్పుకుంది. మిగిలినవారు ససేమిరా అన్నారు. ప్రతిపక్ష వైసీపీ కౌన్సిలర్లు కూటమి బెదిరింపులకు లొంగడం లేదు. దీంతో ఎలాగైనా వైస్ చైర్మన్ పదవిని లాక్కోవాలని కూటమి దౌర్జన్యకాండకు దిగుతోంది.
వైసీపీ నేతల ‘ఛలో తుని’ కార్యక్రమం అడ్డుకున్న పోలీసులు.. ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీ నేతలను హౌస్ అరెస్ట్లు చేశారు. వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభం, కన్నబాబు, ద్వారంపూడి, వంగా గీత , జక్కంపూడి రాజాతో పాటు పలువురికి పోలీసుల నోటీసులు అందజేశారు. తుని సమీపంలో ముద్రగడను పోలీసులు అడ్డుకోగా, పోలీసులతో ముద్రగడ అనుచరుల వాగ్వాదానికి దిగారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఆగ్రహిస్తోంది.
మరోవైపు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కలెక్టర్ తో మాట్లాడగా, కౌన్సిలర్లను సమావేశానికి పంపాలని కలెక్టర్ సూచించారు. కౌన్సిలర్లకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని కలెక్టర్ హామీ ఇవ్వడంతో మున్సిపల్ చైర్ పర్సన్ సుధారాణి నివాసం నుంచి 17 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి బయల్దేరారు.
మున్సిపల్ ఆఫీస్కు బయల్దేరిన వైసీపీ టీడీపీ నేతలు అడ్డుకొని, దాడి యత్నించారు. ప్రాణభయంతో వైసీపీ కార్పొరేటర్లు వెనుదిరిగారు. బారికేడ్లను దాటుకొని మున్సిపల్ ఆఫీస్ వైపునకు కూటమి కార్యకర్తలు దూసుకెళ్లారు. గుంపులు గుంపులుగా మున్సిపల్ కార్యాలయం లోపలికి టీడీపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. కూటమి కార్యకర్తల ఓవర్ యాక్షన్ను పోలీసులు సైతం కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుండగా, మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది.








