తుని (Tuni)లో బాలిక (Girl)పై టీడీపీ(TDP) వృద్ధ నాయకుడి అత్యాచార బాగోతం.. నిందితుడి ఆత్మహత్య సంచలనం రేపుతున్నాయి. బాలికకు మాయమాటలు చెప్పి సపోట తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించిన కేసులో టీడీపీ నేత నారాయణరావు (Narayana Rao)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా టాయిలెట్ అని చెప్పి నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో తుని కోమటిచెరువు పరిసర ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. మైనర్ బాలికపై కేసులో నిందితుడైన టిడిపి నేత తాటిక నారాయణరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా, ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. “ఇది ఆత్మహత్య కాదు, అనుమానాస్పద మరణం” అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నారాయణరావు కుమారుడు మాట్లాడుతూ – “నాన్న ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు కానీ, చెప్పిన టైమ్ పై తీవ్ర అనుమానం ఉంది. నిన్న రాత్రి 10:30 గంటలకు చెరువులో దూకాడని చెబుతున్నారు. అయితే ఉదయం 7 గంటలకి మృతి జరిగిందంటూ సీఐ చెబుతున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదు” అని అన్నారు. ఇంకా, నలుగురు పోలీసులు వచ్చి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
మృతదేహాన్ని తరలించే సమయంలో ఉద్రిక్తత చెలరేగగా, పోలీసులు ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులను పక్కకు లాగి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నారాయణరావు మృతిపై కుటుంబం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తోంది. స్థానికులు కూడా ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని పోలీసులను కోరుతున్నారు.








