తిరుమలలోని TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నేడు సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు పరిహారంపై కీలక తీర్మానం చేయనున్నారు. తొక్కిసలాటలో మృతిచెందిన ఆరుగురు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిహారం చెక్కులను సాయంత్రానికల్లా సిద్ధం చేసి, రేపు ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం వాటిని అందజేయడం గురించి చర్చించనున్నారు. తొక్కిసలాట ఘటన తరువాత జరుగుతున్న ఈ సమావేశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పరిహారం పంపిణీతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.
తొక్కిసలాట ఘటన అధికారుల తప్పిదంగా భావించిన ప్రభుత్వం ఇద్దరి సస్పెండ్ చేసి, మరో ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి వైఫల్యమని, దీనిపై నిస్పక్షపాత విచారణ జరగాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కేసును నీరుగార్చేందుకు తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.