రాజస్థాన్ కోట్పుత్లీ జిల్లాలో చోటుచేసుకున్న బోర్ బావి ఘటన విషాదాంతమైంది. డిసెంబర్ 23న 700 అడుగుల బోరు బావిలో 150 అడుగుల లోతులో చిక్కుకుపోయిన చేతన (3) అనే చిన్నారి, 10 రోజుల పాటు నరకయాతన అనుభవించి, చివరకు చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆమెను బయటకు తీసేందుకు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఎట్టకేలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించి 10 రోజుల తరువాత చేతనను బయటకు తీశారు. వెంటనే ఆ బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మొదట చేతన ఆరోగ్యం నిలకడగానే ఉందని వార్తలు వచ్చినప్పటికీ, బాలికను బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ, చివరకు పరిస్థితులు అనుకూలించలేదని తెలుస్తోంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన బాలికను డాక్టర్లు పరిశీలించగా, అప్పటికే ఆ చిన్నారి మృతిచెందినట్లుగా డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ వార్త వినగానే చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్థులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఈ ఘటన తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని, బోర్ బావుల భద్రతపై మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.