టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చింది. కార్మికుల సమ్మె కారణంగా చిత్రపరిశ్రమ పనులు నిలిచిపోయాయి. ఈ సమ్మె వల్ల రోజుకు సుమారు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోందని పేర్కొంటూ పీపుల్స్ మీడియా సివిల్ కోర్టులో కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నేతలు వల్లభనేని అనిల్, అమ్మిరాజు, అలెక్స్లకు వ్యక్తిగతంగా లీగల్ నోటీసులు పంపారు. టీజీ విశ్వప్రసాద్ చర్యతో సినీ కార్మికుల ఫెడరేషన్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
పీపుల్స్ మీడియా నుంచి లీగల్ నోటీసులు రావడంపై ఫెడరేషన్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక నేతలతో త్వరలోనే భేటీ కావాలని నిర్ణయించుకున్న వారు, ఈ ఆదివారం తమ తదుపరి కార్యాచరణ ప్రణాళికను అధికారికంగా ప్రకటించనున్నారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందో, వివాదం ఎటువైపు దారితీస్తుందో పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. సమ్మె కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్లు నిలిచిపోయాయి. 30 శాతం వేతనాలు పెంచాలని గత వారం రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.








