ఆసియాలోనే అతిపెద్ద తీహార్ జైలు (Tihar Jail)ను మరోచోటకు మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ శివారులో ప్రత్యామ్నాయ జైలు నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన విడుదలైంది. ఎందుకంటే.. తీహార్ జైలు సామర్థ్యాన్ని మించి ఖైదీలతో నిండిపోయింది. 10,026 మంది ఖైదీలకు మాత్రమే సరిపోవాల్సిన ఈ జైలులో ప్రస్తుతం 19,500 మంది వరకు ఖైదీలున్నట్లు సమాచారం. జైలు చుట్టుపక్కల నివసించే ప్రజల భద్రతకూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రద్దీని తగ్గించేందుకు మండోలీ జైలు నిర్మించారు. తాజాగా తీహార్ జైలును పూర్తిగా వేరే ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు.
నూతన జైలు ఎక్కడ?
నరేలా, బాప్రోలా వంటి ప్రాంతాల్లో కొత్త జైళ్ల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక్కడే తీహార్ జైలును కూడా తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించి, భద్రతా పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.








