గుంటూరు నగరంలో తొలిసారిగా కొకైన్ స్వాధీనం కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద నగరాలకు పరిమితమైన ఈ మాదకద్రవ్యం ఇప్పుడు గుంటూరులో బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎక్సైజ్ పోలీసులు గుంటూరులో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద 8.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఇది రాష్ట్రంలో నమోదైన తొలి కొకైన్ కేసు అని అధికారులు తెలిపారు. మార్కెట్లో ఒక్కో గ్రాము కొకైన్ ధర రూ.3,000 నుంచి రూ6,000 వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలీసులు మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తూ, అనుమానాస్పద సమాచారం వెంటనే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రాష్ట్రంలో గంజాయిని నిర్మూలిస్తాం అని కూటమి ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో మాదవద్రవ్యాల వినియోగం విపరీతమవుతోంది. ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ఎక్కడికక్కడ గంజాయి ముఠాలను అరెస్టు చేస్తున్నప్పటికీ, అక్రమ రవాణా అరికట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా కొకైన్ పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితి కంట్రోల్ చేయకపోతే, కొకైన్ వంటి మాదక ద్రవ్యాల వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తాజా ఘటనే స్పష్టం చేస్తోంది.