76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ప్రముఖులు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకోనున్నారు.
తెలంగాణ నుంచి మందకృష్ణకు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. అదే విధంగా వైద్య విభాగంలో దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషన్ అవార్డు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విద్య, సాహిత్యం విభాగంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, కళారంగంలో మాడుగుల నాగఫణి శర్మకు, మిరియాల అప్పారావుకు, విద్య, సాహిత్యం విభాగంలో రాఘవేంద్రచార్యకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. సినీ రంగం నుంచి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ లభించింది.
ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులకు గానూ కేంద్రం ప్రభుత్వం 139 మంది ప్రముఖులను ఎంపిక చేసింది. ఇందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ మొత్తం జాబితాలో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు ఉన్నారు. ఈ పురస్కారాలు వివిధ రంగాలలో విశేష కృషి చేసి దేశ అభివృద్ధికి తోడ్పడిన ప్రముఖులను గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.