డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బస్సుపై టీడీపీ, జనసేన నేతలు దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు భయంతో కేకలు వేశారు. బస్సు అద్దాలు ధ్వంసం చేసిన అనంతరం తమ పార్టీ కార్పొరేటర్లను అధికార పార్టీ నేతలు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
వైసీపీ కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై జనసేన, టీడీపీ కార్యకర్తల కర్రలు, రాళ్లతో దాడి చేశారని వైసీపీ మండిపడుతోంది. ఈ దాడిలో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో మీడియా రిపోర్టర్, కెమెరామెన్పై సైతం దాడి జరిగింది. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసుల సమక్షంలోనే కూటమి నేతలు రెచ్చిపోయారని, వైసీపీ కార్పొరేటర్లపై దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిల్చున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ కార్పొరేటర్లను రక్తం వచ్చేలా దాడిచేశారని, తాము పోలీసులకు ఫోన్ చేసినా వారు కావాలనే ఆలస్యంగా ఘటనా స్థలానికి వచ్చారని వైసీపీ మండిపడుతోంది. డిప్యూటీ మేయర్ పదవి గెలుచుకునే బలం లేకపోయినా కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బెదిరిస్తున్నారని, ఎక్కడికక్కడ దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. సంఖ్యాబలం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని భూమన నిలదీశారు.