తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు స్టేట్స్ మధ్య పోటీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి దిశగా రెండు రాష్ట్రాల మధ్య సహకారం అవసరమని ఆయన చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ను ప్రపంచ స్థాయికి..
ప్రపంచ మహా నగరాలతో పోటీపడగల సామర్థ్యం గ్రేటర్ హైదరాబాద్కు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను తమ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ ఆదేశాలు (గవర్నమెంట్ ఆర్డర్స్, జీవోలు) తెలుగులోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగితే అభివృద్ధి వేగవంతమవుతుందని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి నిర్ణయం ప్రజల మేలు కోసమే ఉండాలి అని ఆయన పేర్కొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రభుత్వ జీవోలను ఇక నుంచి తెలుగులో అందుబాటులో ఉంటాయని ఇటీవల ప్రకటించి, అధికారులకు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు బాటలోనే రేవంత్ కూడా తెలుగులో ప్రభుత్వ ఆదేశాలు అందజేస్తామని ప్రకటించడం గమనార్హం.