రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఆరోగ్యశ్రీ పథకానికి (Aarogyasri Scheme) జబ్బు చేసింది. బకాయిలు పెరిగిపోతుండడంతో నెట్వర్క్ ఆస్పత్రులు (Network Hospitals) వైద్య సేవలకు (Medical Services) బ్రేకులు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్పెషాలిటీ ఆసుపత్రులు ఎన్టీఆర్ (NTR) వైద్య సేవ పథకం కింద ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను నిలిపివేశాయి. ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ.2,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉండటమే దీనికి ప్రధాన కారణం. తమ సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ దినేష్ కుమార్ (Dinesh Kumar) కు లేఖ రాశారు. గతంలో కూడా పలుమార్లు ఆందోళనలు చేసిన ఆసుపత్రులు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) కింద కూడా రూ.200 కోట్ల బకాయిలు ఉన్నందున ఆ సేవలను ఇప్పటికే నిలిపివేశాయి. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు.
తెలంగాణలోనూ..
ఇదే తరహాలో తెలంగాణలోనూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,400 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు TANHA ప్రకటించింది. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేసింది.








