- తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడికి అధిష్టానం పిలుపు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సీరియస్గా ఉంది. తన చర్యలతో పార్టీకి తలనొప్పిగా తయారైన శ్రీనివాస్కు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు అవ్వాలని కొలికపూడికి ఆదేశాలు అందాయి. కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా హుకుం జారీ చేశారు.
జనవరి 11వ తేదీన తిరువూరు నియోజకవర్గం ఏ. కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ సంఘటనను సీరియస్గా పరిగణించిన టీడీపీ హైకమాండ్, సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు తెలపాలన్న అధిష్టానం కొలికపూడిని ఆదేశించింది. తిరువూరులో జరిగిన ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
క్రమశిక్షణ కమిటీ ముందు కొలికిపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణను కమిటీ బృందం హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లనుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే కొలికపుడిపై అధిష్టానం తదుపరి చర్యలు తీసుకోనుంది. తిరువూరులో ఎమ్మెల్యే తీరు టీడీపీకి ఇబ్బందికరంగా మారిందని, గతంలో సత్యవేడు దళిత ఎమ్మెల్యే ఆదిమూలంపై వేటు వేసినట్లుగా తిరువూరు ఎమ్మెల్యే పైనా సస్పెన్షన్ వేటు పడొచ్చని స్థానిక టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.