తెలంగాణ (Telangana)లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి (B.R. Gavai) కీలక వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో సంచలనం రేపారు. స్పీకర్ నిరంతరం నిర్ణయం వాయిదా వేస్తూ వస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీజేఐ (CJI), ఇక ఆలస్యం అనుమతించబోమని స్పష్టం చేశారు.
వచ్చే వారం వరకు గడువు లేకుంటే..
ఫిరాయింపు కేసులు మూడు నెలల గడువు దాటినా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన సిజెఐ గవాయి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని తుది గడువు విధించారు. లేకుంటే స్పీకర్ కాంటెంప్ట్కు సిద్ధంగా ఉండాలని సంచలన కామెంట్స్ చేశారు. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని ముందే చెప్పాం. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కేసు నేపథ్యం
బీఆర్ఎస్ (BRS)కు ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో స్పీకర్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ధిక్కరణ పిటిషన్ వేశారు. మూడు నెలల గడువు పూర్తయ్యే సరికి తీర్పు రాకపోవడంతో ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఇవాళ విచారణ జరగ్గా, స్పీకర్పై సీజేఐ సంచలన కామెంట్స్ చేశారు.








