తెలంగాణ (Telangana)లో ఏడాదిగా పెండింగ్లో ఉన్న పంచాయతీ ఎన్నికలకు (Panchayat Elections) సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా సమాచారం మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలను జూలై (July)లో నిర్వహించేందుకు సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం ఇంకా పరిష్కారం కాకపోవడం వల్ల ఎన్నికల ప్రక్రియపై అంతిమ నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఈ అంశంపై స్పష్టత వచ్చిన వెంటనే, ఓటరు జాబితా తయారీ, నామినేషన్ల ప్రక్రియ, మరియు ఎన్నికల షెడ్యూల్పై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఈసారి రిజర్వేషన్ల అంశం రాజకీయంగా కూడా చాలా కీలకం కావడంతో, ప్రభుత్వం అన్ని కోణాల్లో చర్చలు జరుపుతోంది. తుది నిర్ణయం ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది.
పంచాయతీ ఎన్నికల కోసం అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) సైతం ఎదురుచూస్తోంది. రజతోత్సవ సభ విజయవంతంతో జోష్లో ఉన్న బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా చాటాలనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీపై గ్రామస్థాయిలో పెరుగుతున్న వ్యతిరేకతను తమ పార్టీకి అనుకూలంగా మలుచుకొని పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి దెబ్బ కొట్టాలని గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) కూడా మెజార్టీ పంచాయతీలను తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది.