అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్లో “రన్ ఫర్ యాక్షన్” పేరుతో 2K, 5K రన్-2025 కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర పోలీసు శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళల సమానత్వంపై సీతక్క..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలను సమాజంలో ఇంకా చిన్న చూపుతో చూస్తున్న పరిస్థితి మారాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. “మహిళలు సెకండ్ గ్రేడ్ వర్కర్స్ కాదు.. వారికి సమానత్వం, గౌరవం లభించాలి” అని సీతక్క స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలవాలని, వారి వ్యక్తిత్వ వికాసానికి సహకరించాలని ఆమె కోరారు. “మహిళల ఎదుగుదలకు ప్రభుత్వ మద్దతు తప్పనిసరి” అని పేర్కొంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు చేయూతనందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు
పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మహిళల భద్రత తమ ప్రధాన బాధ్యతగా చెప్పారు. సిటీ పోలీస్ అండ్ షీ టీమ్స్ ద్వారా మహిళల కోసం ఎన్నో భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్లో 8 మంది మహిళా డీసీపీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారన్నారు.