తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, ఆరోగ్యశాఖలో మరోసారి పెద్ద ఎత్తున నియామకాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 10వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఇప్పటికే కొన్ని రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ వంటి విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఆరోగ్యశాఖలోని నిధుల కింద పనిచేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో భర్తీ చేయనున్నారు.
ఇక గత 17 నెలల కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్కి సంబంధించి 8,000కుపైగా పోస్టులను భర్తీ చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్మసిస్ట్లు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్లు, 1,931 మల్టిపర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్లు (MPFHA) వంటి విభాగాలకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ నియామకాల కోసం ఇప్పటికే పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేసిన అధికారులు, ఇప్పుడు మెరిట్ జాబితాలను సిద్ధం చేస్తున్నారు.
ఈ నేపథ్యంతో ఉద్యోగాన్వేషకులు తాజా నోటిఫికేషన్లపై దృష్టి సారించి, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి వివరాలను త్వరగా తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.