తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలు గత పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరంలా ఎదిగితే, ఇప్పుడు ఏడాది కాంగ్రెస్ పాలనలోనే కూలిపోతున్నాయని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ఆదివారం “జాగో తెలంగాణ జాగో” అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
గతంలో గురుకులాల్లో సీటు కోసం విద్యార్థులు పోటీ పడుతుండగా, ఇప్పుడు ఆ పేరు వింటే భయపడే స్థితి వచ్చిందని అన్నారు. సరైన దిశానిర్దేశం లేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. “నాడు కడుపునిండా భోజనం చేసి లక్ష్యాలు సాధించిన విద్యార్థులు, నేడు అన్నమో రామచంద్ర అనే దుస్థితిని ఎదుర్కొంటున్నారు” అని తెలిపారు.
సంఖ్యల్లో అసలు తేడా..
కేటీఆర్ అందించిన గణాంకాల ప్రకారం 2014-2023లో 41 వేల సీట్లకు 1.68 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2024లో 51 వేల సీట్లకు కేవలం 80 వేల దరఖాస్తులే వచ్చాయి. ఈ సంఖ్యను బట్టి విద్యార్థులు గురుకులాల్లో చేరేందుకు ఆసక్తి తగ్గిపోయిందని, ప్రభుత్వం విద్యా వ్యవస్థపై పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తోందని కేటీఆర్ అన్నారు.
నిర్లక్ష్యంతో 50 మంది విద్యార్థుల బలి
గత ఏడాదిలో ఫుడ్ పాయిజన్ సహా వివిధ కారణాలతో 50కి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వం కనీస స్పందన చూపడం లేదని కేటీఆర్ విమర్శించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని, ప్రతిపక్షం అంత్యక్రియలకు వెళ్తే నిర్బంధిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవిష్యత్తు అయిన భావితరాలకు ఈ నిర్లక్ష్యం శాపంగా మారుతుందని అని తల్లిదండ్రులను హెచ్చరించారు.