స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో సభావత్ శ్రీనివాస్ నాయక్, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి సభావత్ విజయ సహా పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. వీరికి మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప, మిగతా హామీలు ఎక్కడా అమలుకావడం లేదని విమర్శించారు. కుల గణన ప్రక్రియలో తప్పిదాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనాభాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు కాంగ్రెస్ పట్ల విసుగుచెందుతున్నారని, త్వరలో ఎన్నికలు వస్తే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు.