ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి మల్కాజ్గిరి (Malkajgiri) ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై 2016లో నమోదైన క్రిమినల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు (High Court)లో ఊరట (Relief) లభించింది.
కేసు నేపథ్యం: గోపన్నపల్లి భూ వివాదం
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలో ఐటీ హబ్గా పేరొందిన గచ్చీబౌలీకి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపన్నపల్లిలో 31 ఎకరాల హౌసింగ్ సొసైటీ భూములను ఆక్రమించుకునేందుకు రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్ రెడ్డితో పాటు అతని అనుచరులు ప్రయత్నించారంటూ ఫిర్యాదులందాయి.
ఆ ఫిర్యాదుల్లో రేవంత్రెడ్డి, అతని సోదరుడు, అనుచరులు ఎలాంటి హక్కులు, అనుమతులు లేకుండా వివాదాస్పద సొసైటీ భూముల్ని వినియోగించుకునేందుకు ప్రయత్నించారని, సొసైటీ సభ్యుల్ని బెదిరించడం, భూములతో సంబంధం ఉన్నవారిని దూషించారంటూ పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చీబౌలీ పోలీసులు రేవంత్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భూముల వివాదానికి సంబంధించి కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలైంది.
హైకోర్టులో విచారణ, తీర్పు
హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. సొసైటీ భూముల వ్యవహారంలో తమ ప్రమేయం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా తనపై కేసు నమోదు చేశారని రేవంత్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఇదే కేసులో 2019లో రేవంత్ మరో ఛార్జిషీట్ దాఖలు చేసి, న్యాయ విచారణ నిలిపివేయాలని కోరారు. రేవంత్ తరపు వాదనలు విన్న కోర్టు ఎటువంటి అధికారిక అభియోగాలు మోపలేదు.
దీనికి ప్రతిస్పందనగా, హౌసింగ్ సొసైటీ తరపు న్యాయవాదులు ఈ కేసులో రేవంత్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సొసైటీ భూముల వివాదంపై రిపోర్టును తయారు చేసి ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో 2020లో రేవంత్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సొసైటీ భూముల వివాదంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై గత జూన్ 20న విచారణ చేపట్టిన కోర్టు తీర్పును జులై 17కి రిజర్వ్ చేసింది.
ఇవాళ (జులై 17) కోర్టులో జరిగిన విచారణలో.. సంఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని హైకోర్టు తెలిపింది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. దీంతో గచ్చిబౌలి పీఎస్లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసింది. ఈ తీర్పు రేవంత్ రెడ్డికి పెద్ద ఊరటగా మారింది.