హైదరాబాద్ ఐటీ రంగంలో మరో ముందడుగు వేసింది. మైక్రోసాఫ్ట్(Microsoft) తన నూతన క్యాంపస్ను హైదరాబాద్లో ప్రారంభించింది. దీంతో గ్రేటర్ నగరానికి మరో గౌరవం దక్కింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ విస్తరణ హైదరాబాద్ యువతకు గొప్ప అవకాశాలను అందిస్తుందని సీఎం అన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య బలమైన భాగస్వామ్యం ఉందని, కంపెనీ విస్తరణతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా మలుచుకోనుందని చెప్పారు.
500 పాఠశాలల్లో AI విద్యా కార్యక్రమం
తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ కలిసి 500 ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధనను ప్రవేశపెట్టనుందని, విద్యార్థులకు ఇది కొత్త అవకాశాలను అందించే గొప్ప ముందడుగు అని చెప్పారు. “మైక్రోసాఫ్ట్ సాయంతో, AI ను ప్రభుత్వ పరిపాలనలో ఉపయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మా స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతానికి, మెంటార్షిప్, AI టూల్స్ మరియు గ్లోబల్ నెట్వర్క్ యాక్సెస్కు ఇది దోహదపడుతుంది” అని సీఎం తెలిపారు.
హైదరాబాద్ ఐటీ రంగ పురోగమనం, మైక్రోసాఫ్ట్ కొత్త AI సెంటర్ వల్ల మరిన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీమ్కు సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.