తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలు, కొత్త పథకాలు, ప్రజా ప్రయోజనాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. నూతన ఏడాది తొలి కేబినెట్ మీటింగ్ కావడంతో సంక్షేమ పథకాల అమలుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ప్రజల్లో కొంత ఆసక్తి నెలకొంది.
రైతుల సంక్షేమం కోసం కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన విధివిధానాలను ఈరోజు కేబినెట్ ఆమోదించనుంది. ఇందులో భాగంగా.. ప్రతి రైతుకు పంట పెట్టుబడిగా నేరుగా ఆర్థిక సాయం అందించడం, రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000 ఇచ్చేందుకు ప్రతిపాదనపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంపై చర్చ జరుగనుంది. అలాగే, సన్నబియ్యం పంపిణీ మెరుగుపరచడం కోసం నూతన విధానాలను రూపొందించనున్నారు.
ఇళ్లు లేని నిరుపేదలు సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద లబ్ధిదారులకు ఇసుక, సిమెంట్, స్టీల్ లాంటి నిర్మాణ సామగ్రిని సబ్సిడీ రేట్లతో అందించేందుకు ప్రస్తుత సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. 20 మందితో కూడిన ఈ బోర్డు ఆలయ అభివృద్ధికి కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రత్యేక కమిషన్కు గణాంకాలు అందించే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశం ద్వారా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరిన్ని కొత్త మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం ఉంది.