తెలంగాణ బీజేపీ (Telangana BJP) రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై గోషామహల్ ఎమ్మెల్యే (Goshamahal MLA) రాజాసింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిని ‘నావాడు, నీవాడు’ (My Person, Your Person) అనే విధానంతో నియమిస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక బూత్ స్థాయి కార్యకర్త నుంచి ముఖ్య నాయకుల వరకు ఓటింగ్ ద్వారా జరగాలని రాజాసింగ్ అభిప్రాయపడుతూ రాజాసింగ్ సంచలన వీడియో(Video)ను విడుదల చేశాడు. ఈ వ్యాఖ్యలు పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న అసంతృప్తి, చర్చలను మరింత రాజుకునేలా చేశాయి.
రాజాసింగ్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని ఇప్పటికే నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, అయితే ఈ నియామకం పారదర్శకంగా, బూత్ స్థాయి నుంచి ఓటింగ్ ద్వారా జరిగితేనే పార్టీ బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో కొందరు అధ్యక్షులు తమ సొంత గ్రూపులను సృష్టించి, పార్టీ కార్యకర్తలను, ముఖ్యంగా హిందుత్వ భావజాలాన్ని పాటించే వారిని నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. ఇటువంటి విధానాలు కొనసాగితే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమవుతుందని ఆయన హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేశాయి. రాజాసింగ్ గతంలోనూ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు నియామకాల్లో పార్టీ నాయకత్వం తన సిఫారసులను పట్టించుకోలేదని ఆరోపించారు. అంతేకాక, కొందరు నాయకులు ముఖ్యమంత్రి (Chief Minister) ఎ. రేవంత్ రెడ్డి (A.Revanth Reddy)తో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఇది పార్టీ హిందుత్వ భావజాలానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో పారదర్శకత, కార్యకర్తల సమ్మతి లేకపోతే పార్టీ సర్వనాశనమవుతుందని రాజాసింగ్ హెచ్చరించారు, ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2025
నావాడు, నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించుకుంటూ పోతే పార్టీకే తీవ్ర నష్టం
రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు ప్రచారం నడుస్తోంది
రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి… https://t.co/REJBVBMTmq pic.twitter.com/dK3VghOsdG








