తెలుగుదేశం పార్టీ, జనసేనతో పొత్తుతో తమకే నష్టం వాటిల్లుతుందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడతాయని, వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేయడం బీజేపీకి నష్టమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ స్వయంగా ఎదుగుతున్న తరుణంలో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అనవసరమని అభిప్రాయపడ్డారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ మరియు జాతీయ పార్టీల వైఖరుల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
బీజేపీ ఒక్కో నియోజకవర్గంలో తన బలాన్ని పెంచుకుంటూ స్వతంత్రంగా ముందుకు సాగుతుందని, ఈ దశలో అసలు తెలంగాణలో ఉనికి అంటూ లేని తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు అవసరమే లేదని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు తెలంగాణలో పొత్తు పెట్టుకుంటున్నాయని ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.