తెలంగాణ శాసనసభ, శాసనమండలి మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ల ఖరారుపై కీలక చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రణాళికా శాఖ ఇటీవల నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే నివేదికను ఆదివారం బీసీ మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది.
ఈ నివేదికను ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సమర్పించనుంది. దీని ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారు పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నివేదికపై కేబినెట్లో చర్చించి ఆమోదించిన అనంతరం శాసనసభ, మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.