ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు తన గెలుపుపై స్పందించారు. మీడియా ముందుకు వచ్చి తన గెలుపునకు సహకరించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన గెలుపు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తనను ఉపాధ్యాయులు, అధ్యాపకులు గెలిపించారని, వారి సమస్యల కోసం శాసనమండలిలో ప్రభుత్వంతో పోరాటం చేస్తానని చెప్పారు. తన గెలుపునకు మంత్రి అచ్చెన్నాయుడు మద్దతు ఇచ్చిన విషయంపై తనకు అవగాహన లేదని సెటైర్ వేశారు. ఎమ్మెల్సీగా విజయం పూర్తిగా గవర్నమెంట్ టీచర్ల సహకారమేనని మరోసారి స్పష్టం చేశారు.
ఓటమిపై స్పందించిన రఘువర్మ..
గాదె శ్రీనివాసులు చేతిలో ఓటమికి గురైన కూటమి పార్టీల మద్దతు అభ్యర్థి రఘువర్మ స్పందించారు. ఉపాధ్యాయులకు సేవ చేశానని, అయినా ఓడిపోవడం బాధగా ఉందని, టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ గెలవలేకపోయానని, గతంలో యూటీఎఫ్ తో కలిసి పోటీ చేసి విజయం సాధించానని చెప్పారు. ఈసారి యూటీఎఫ్ విడివిడిగా పోటీ చెయ్యడం కూడా పరాజయానికి కారణమని చెప్పారు.








