ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం సేవించి విద్యార్థులను చితకబాదాడు. ముద్దటమాగి గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు జయరాజు మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. స్కూల్లో కూడా మద్యం సేవిస్తూ చిన్నారులపై దాడి చేశారు.
ఈ సంఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలిసిన వెంటనే, వారు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతుండగా, పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా స్పందించారు. సంబంధిత ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా ఆ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.