తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కొలికపూడి పలు వివాదాలకు కారణమవుతుండటంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల ఎ.కొండూరు మండలంలో జరిగిన సంఘటనలో మహిళ ఆత్మహత్యాయత్నానికి ఆయన కారణమన్న ఆరోపణలతో, క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. అధిష్టానం పిలుపు మేరకు తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు కమిటీ సభ్యులు ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ముందు హాజరయ్యారు.
ఏడు నెలల్లో అనేక వివాదాలు
తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం కంభంపాడులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చిట్యాలలో సర్పంచ్ను తూలనడడం, ఆయన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆందోళన కలిగించింది. టీడీపీ గ్రామ కార్యదర్శి రాంబాబు ఇంటి వద్ద రోడ్డు వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఎమ్మెల్యే అణిచివేత చర్యలకు పాల్పడ్డారని భూక్యా చంటి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు.
తన వ్యవహారశైలితో వివాదాలకు కారణంగా నిలుస్తున్న కొలికపూడిపై పార్టీ అగ్రనాయకత్వం గుర్రుగానే ఉంది.
ఈ వివాదాల నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు కొలికపూడి కమిటీ ఎదుట హాజరయ్యారు. ఎమ్మెల్యే సమాధానాలను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కమిటీ తీసుకెళ్లనుంది. అధినేత ఆదేశాల మేరకు కొలికపూడిపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.








