కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై జనసేన నేత సంచలన ఆరోపణలు చేశారు. అవినీతిని పక్కా ఆధారాలతో నిరూపిస్తానని చేసిన ఛాలెంజ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తిరువూరు జనసేన సమన్వయకర్త మునుబోలు శ్రీనివాసరావు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అవినీతికి సంబంధించిన పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకంలో రూ.2 లక్షల చొప్పున లంచం తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, మట్టి, మద్యంలో అవినీతి భాగస్వామ్యం ఎంత ఉందో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని మునుబోలు శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. తన భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా అవినీతిని వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఆయన ప్రవర్తనపై తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా ఆగ్రహంతో ఉందని, ఇటీవల క్రమశిక్షణ కమిటీ నోటీసులు అందించడం, ఆయన విచారణకు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. ఎమ్మెల్యే చేష్టలతో తిరువూరు టీడీపీ, జనసేన క్యాడర్ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని గతంలో వార్తలు సైతం వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొలికపూడి అవినీతిపై జనసేన నేత చేసిన ఆరోపణలు స్థానికంగా ఇరు పార్టీల మధ్య ఉన్న విభేదాలను సృష్టం చేస్తున్నాయి. వాటాల విషయంలో తేడాలు రావడంతోనే అవినీతి ఆరోపణలు చేశారని తిరువూరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై కూటమి పార్టీ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.