తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తరచూ వివాదాల్లో కూరుకుపోతుండటం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమరావతి రైతుల ఉద్యమం సమయంలో ప్రజా దృష్టిని ఆకర్షించి టీడీపీకి దగ్గరైన కొలికపూడి.. అప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. టీవీ డిబేట్లలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
కాగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతక కూడా కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలిని మార్చుకోలేదని తరచూ వివాదాస్పదన వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. కొలికపూడి తీరు టీడీపీ అధినేత చంద్రబాబుకు నచ్చకపోవడంతో, ఆయనపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీకి ప్రతిష్టాహనికరం అయ్యేలా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది.
ఎన్నికల్లో గెలిచిన తరువాత తిరువూరులో ఎమ్మెల్యే తీరుకు నిరసనగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ తరువాత బెల్ట్ షాపుల ఏరివేత అంటూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు కొలికపూడి. ఇటీవల కుటుంబ ఆస్తి వివాదంలో తలదూర్చి ఓ ఇంటిపై దాడి చేయడం, మహిళా ఆత్మహత్యాయత్నం చేయడం వంటి విషయాలతో ఆయనపై తిరువూరులో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని చెప్పుకుంటున్నారు. దీంతో చంద్రబాబు కొలికపూడిపై సీరియస్గా ఉన్నట్లు సమాచారం.
పార్టీకి వీలైనంత వరకు అంతర్గత వివాదాలను బయటపడనివ్వకుండా ఉండేందుకు చంద్రబాబు తీసుకునే స్ట్రాటజీ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే చర్యల వల్ల టీడీపీ ప్రతిష్ట దెబ్బతిన్నా, భవిష్యత్ రాజకీయాల్లో ఆ ప్రభావం ఎలా ఉంటుందో వేచిచూడాల్సి ఉంది.