ఆళ్లగడ్డలో అధికార తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని గుంపరమాన్దిన్నె గ్రామానికి చెందిన ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త, వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ కుందనూరు మోహన్రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. స్థానికంగా జరుగుతున్న అన్యాయాలను చూసి సహించలేకనే తాము రాజీనామా చేసినట్లుగా వారిద్దరూ సన్నిహితుల వద్ద చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీకి గుడ్బై చెప్పారు. వీరి రాజీనామా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఇది గట్టి ఝలక్ అంటున్నారు స్థానికులు.
టీడీపీకి రాజీనామా చేసిన వారి వివరాల ప్రకారం.. “అఖిలప్రియ ఎటు వెళ్లినా మేము అనుచరులుగా వెళ్దాం అనుకున్నాం. కానీ పార్టీ కార్యకర్తలకు గౌరవం లేదు. న్యాయం లేదు. కేవలం ‘కప్పం’ పేరిట పదవులే కాదు, అభివృద్ధి పనులు కూడా అమ్ముకుంటున్నారు” అని వారు వాపోయారు.
‘బి’ ట్యాక్స్ వ్యవహారం.. పార్టీలో చర్చకు దారి
పార్టీ వర్గాల ప్రకారం, మోహన్రెడ్డి చైర్మన్ పదవికి రూ.5 లక్షల ‘బి’ ట్యాక్స్ చెల్లించారని, అలాగే గ్రామంలోని అంగన్వాడీ పోస్టు కోసం రూ.8 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. పైగా, రాజనగరంలో సీసీ రోడ్లకు మంజూరైన రూ.10 లక్షల నిధులు ఇతరులకు కమీషన్ కింద అప్పగించారని సమాచారం. కేసీ కెనాల్ అభివృద్ధి పనులను కూడా మోహన్రెడ్డిని పక్కనపెట్టి, ‘బి’ ట్యాక్స్ చెల్లించిన వారికి కట్టబెట్టినట్టు తెలిసింది. ఈ అసంతృప్తి నేపథ్యంలోనే భర్తా భార్యలు ఇద్దరూ రాజీనామా చేసినట్లుగా సమాచారం.
పారదర్శకత లేకపోవడంతో తిరుగుబాటా?
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న పార్టీకే అభివృద్ధి పనుల హక్కు అనే రాజకీయ ధోరణి కొనసాగుతోంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ‘బి’ ట్యాక్స్ తప్పనిసరి కావడం, సేవలకు గుర్తింపు లేకపోవడం, కమీషన్ల కోసం ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్లకు పనులు కట్టడం వల్ల పలువురు స్థానిక నేతలు అసంతృప్తికి గురవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.