ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నేరస్తులుగా మారిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతిపై తిరువణ్ణామలై జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
సూచనల ప్రకారం, ఎంథాల్ బైపాస్ రోడ్డుపై టమాటా లోడ్తో వెళ్తున్న వాహనాన్ని పెట్రోలింగ్ విధుల్లో ఉన్న తూర్పు పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు సుందర్ రాజ్, సురేష్ రాజ్ అడ్డుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పి వాహనంలో ఉన్న వ్యక్తులను కిందకు దించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన లక్ష్మీ అనే యువతిపై ఇద్దరూ దారుణంగా అత్యాచారం చేసి, రోడ్డుపక్కన వదిలి పరారయ్యారు.
తరువాత ఉదయం గ్రామస్తులు ఆ యువతిని గుర్తించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందుతోంది. ఈ ఘటన తెలిసిన వెంటనే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుధాకర్, అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ ఆసుపత్రికి వెళ్లి యువతిని విచారించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అత్యాచారానికి పాల్పడిన కానిస్టేబుళ్లను అరెస్టు చేసి రహస్య ప్రదేశంలో విచారణ చేపట్టారు. ఈ సంఘటనతో పోలీసులు రక్షకులా లేక రాక్షసులా అన్న చర్చ మొదలైంది. ప్రజల భద్రతను కాపాడాల్సిన స్థానంలో ఉన్నవారు ఇలాంటి ఘోరానికి పాల్పడటంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.








