తమిళనాడు రాజధాని చెన్నైలో అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని చెడు అంతమైపోవాలని కోరుతూ, కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై మురుగన్కు మొక్కులు చెల్లించుకునేందుకు ఆరు కొరడా దెబ్బలు స్వయంగా తనకు తానే కొట్టుకున్నారు. అనంతరం ఆయన డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ, స్టాలిన్ సర్కార్ను గద్దె దించేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపడతానని సంచలన ప్రకటన చేశారు.
పాదరక్షలు ధరించను..
గురువారం మీడియాతో మాట్లాడిన కె. అన్నామలై.. 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి వివరాలు ఉన్న ఎఫ్ఐఆర్ లీక్ అవ్వడంపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పోలీసులపై విరుచుకుపడ్డారు. బాధితురాలే భయపడేలా పోలీసులు ఎఫ్ఐఆర్ రాయడాన్ని ఖండించారు. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాలిన్ ప్రభుత్వాన్ని గద్దె దిగే వరకు తాను పాదరక్షలు ధరించను అని, డీఎంకే పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం దారుణమని దుయ్యబట్టారు.
అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు ఎన్నికల్లో ఒక రూపాయి కూడా పంచమని చెప్పిన ఆయన, డీఎంకే ప్రభుత్వంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.