తమిళనాడులో భాషా వివాదం మరింత ముదురుతోంది. త్రిభాషా విధానానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రవ్యాప్త సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమం క్రమంగా ఉద్రిక్తతకు దారితీసింది. సంతకాల సేకరణలో భాగంగా ప్రజల మద్దతును పొందడానికి బీజేపీ నాయకులు ముందుకు వచ్చారు. దీంతో బీజేపీ సీనియర్ నాయకురాలు, తమిళనాడు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి తమిళిసైని అరెస్టు చేశారు.
ఈ అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ భాషా వివాదం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్రంలోని పలు పార్టీల నుంచి తీవ్ర ప్రతిస్పందనలు వస్తున్నాయి. అధికార డీఎంకే పార్టీతో పాటు బీజేపీ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని విద్యార్థులు సైతం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మరి ఈ త్రిభాషా విధానం వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.